Wednesday, 26 December 2018

రెండు నక్షత్రాలు అంటుకొంటే ఎవరైనా చనిపోతారా !

ప్రశ్న : చంద్రుని పక్కనే రెండు నక్షత్రాలు అంటుకొంటే ఆ ఊరిలో ఎవరో చనిపోతారని లేదా ఆ ఊరికి ప్రమాదం ఉందని అంటారు. నిజమేనా?
- జి.మానస,
కాటూరి పబ్లిక్‌ స్కూలు
                  జవాబు : నిజం అనేది ఒకటే! అబద్ధాలు అనంతం. శతకోటి అబద్ధాల్లో నీవు అన్న ఆ 'అంటారు' నమ్మకం ఒకటి. చంద్రుడికి, నక్షత్రాలకు సంబంధం లేదు. తారా చంద్రులు అంటూ చంద్రుడ్ని పురుషుడిగా, ఆయన కోసం తహతహలాడే అమ్మాయిలుగా తారల్ని మత గ్రంథాలు, సాంప్రదాయక సాహిత్యాలు, భావ సాహిత్యం, శృంగార సాహిత్యాలు వర్ణిస్తాయి. మా గ్రంథాల్లో అన్నీ ఉన్నాయి అని చంకలు చరుచుకునే వారు 'తారాచంద్రుల' అబద్ధాన్ని అశాస్త్రీయతను ఎందుకు ఒప్పుకోరో అర్థం కాదు. ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల ద్వారా ఋజువైన తర్వాత ఆ అంశాలు తమకు పురాణ కాలంలోనే తెలుసు అంటారు గానీ శాస్త్ర సాంకేతికతపరంగా వివరణ లేదా ఆవిష్కరణ కాకమునుపే ఆ పురాణ కాలాల్లో ఏవేవి ఉన్నాయో తెలియజేయరు. వాటిని వివరించడం ద్వారా మనమే ముందు ఆవిష్కర్తలయిపోయి 80 సంవత్సరాల తరబడి మచ్చుకయినా దొరకని వైజ్ఞానిక నోబెల్‌ బహుమతిని సాధించవచ్చు కదా! పురాణ గ్రంథాల్లోను, ప్రాచీన భారత దేశంలోను ఏమీ లేదని అనడం కూడా సరికాదు. అయితే అవి ఆయా చారిత్రక, సామాజిక, ఆర్థిక పరిస్థితులకు లోబడి ఆయా సందర్భాలు, కాలాల్లో ఉన్న ఉత్పత్తి సంబంధాలకు అనుగుణంగా ప్రజాసాహిత్యం, ప్రజావిజ్ఞానం, ప్రకృతి పరిజ్ఞానం వుంటాయి. ఆ పునాదుల మీదే ఆధునిక విజ్ఞానశాస్త్రం పరిణామం చెందింది. ఇది తప్ప ఆధునిక విజ్ఞానం ప్రాచీన కాలంలోనే ఉందనడం హాస్యాస్పదం అవుతుంది. ఇది వేరే విషయం.
చంద్రుడు మన భూమికి సగటున లక్షన్నర కి.మీ. దూరంలో ఉన్నాడు. సూర్యుడు మనకు దగ్గరగా ఉన్న అత్యంత చేరువగా ఉన్న నక్షత్రం. మరో మాటలో చెప్పాలంటే తారాచంద్రుల సంబంధంలో చంద్రుడికి దగ్గరగా ఉన్న తార 'సూర్యుడు' మాత్రమే! అయితే సూర్యుడి బింబ పరిమాణం చంద్రుడికి తగ్గడం లేదు కాబట్టి సూర్యుడికి 'ఆడతనాన్ని' , చంద్రుడికి 'ప్రేయసి' అనే బంధాన్ని అతికించలేకపోయారు. చూడ్డానికి నక్షత్రాలు (సూర్యుడు తప్ప మిగిలిన వన్నీ) చాలా చిన్నవిగా కనిపిస్తాయి కాబట్టి, చంద్రుడికన్నా సైజులో తక్కువగా, కాంతిలో బలహీనంగా అనిపిస్తాయి కాబట్టి, ఆడవారికి పురుషుల కన్నా దేహ దారుఢ్యం, బాహ్య భౌతిక రూపం తక్కువగా ఉంటుంది కాబట్టి భూస్వామ్య సంస్కృతిలో భాగంగా తారల్ని (నక్షత్రాల్ని) ఆడగా అవమానిస్తూ, చంద్రుణ్ణి 'మగ'గా అవరోహిస్తూ పరిగణిస్తున్నారు. ఇది కూడా వేరే విషయం.
సూర్యుడి తర్వాత మనకు చేరువగా తదుపరి అత్యంత దగ్గరి నక్షత్రాలు ఆల్ఫా సెంటరీ, ప్రాక్సిమా సెంటారీ అనే రెండు నక్షత్రాలు. అవి మన భూమికి సుమారు నాలుగున్నర కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. మరో మాటలో చెప్పాలంటే అవి మనకు సుమారుగా తొమ్మిదిన్నర లక్షల కోట్ల కి.మీ. (9,50,00,00000000 కి.మీ) దూరంలో ఉన్నాయి.
నీవు ప్రస్తావించినట్లుగా ఏ రెండు నక్షత్రాల మధ్య గానీ ఇక్కడ నేను ప్రస్తావించిన ప్రాక్సిమా సెంటారీ, ఆల్ఫా సెంటారీ నక్షత్రాల మధ్యగానీ 30 నుంచి 40 కోట్ల కి.మీ. కన్నా తక్కువ దూరం ఉండదు. లక్షన్నర ఎక్కడ, తొమ్మిదిన్నర లక్షల కోట్ల కి.మీ. ఎక్కడీ ఈ రెండింటి రాశుల మధ్య నిష్పత్తి సుమారు ఆరున్నర కోట్లు. రూపాయి పెడితే అందే భూమిని కాకుండా ఆ చంద్రుడికి ఆరున్నర కోట్ల రూపాయలు పెడితేగానీ దొరకని తార ఎందుకు అవసరమో తెలీదు. పైగా నక్షత్రాలేవీ చల్లగా గట్టిగా ఉండవు. అవి అగ్ని గోళాలు. లక్ష డిగ్రీల ఉష్ణోగ్రతను శరీరంలో ఉంచుకొన్న ప్లాస్మాభరిత వాయుగోళాలు. చంద్రుడికి దగ్గరగా నక్షత్రాలు రావడం జరగదు. రెండు నక్షత్రాలు అంటు కోవడమూ జరగదు. నీవు ప్రస్తావించిన అంశాల్లో ఎన్నో అశాస్త్రీయతలు, పొంతనలేని విషయాలు ఉన్నాయి. చంద్రుడు ఏ ఒక్క ఊరికో, పేటకో, దేశానికో సొంతం కాదు. ప్రతి ఊర్లో ఎపుడో ఒకసారి, ఏదో ఒక ఊర్లో ప్రతిక్షణం ఎవరో ఒకరు చనిపోతుంటారు. ప్రతి ఊరికి ఎపుడో ఒకసారైనా, ఏదోఒక ఊరిలో ఎప్పుడు చూసినా ప్రమాదం ఉంటూనే వుంటుంది. ప్రమాదాలకు, చావులకు, చంద్రుడికి, తారలకు సంబంధమే లేదు.
- ప్రొ|| ఎ.రామచంద్రయ్య
సంపాదకులు,
చెకుముకి, జనవిజ్ఞాన వేదిక.
email: allikayala@gmail.com 

No comments:

Post a Comment