Friday, 10 September 2021

పర్యావరణ హితంగా పండుగలు

రానున్న నాలుగు నెలల్లో వివిధ మతాలకు చెందిన వినాయక చవితి, దసరా,దీపావళి, మిలాద్ నబి,క్రిస్మస్ వంటి పండుగలు వస్తున్నాయి. బంధువులు, స్నేహితులు కలవడానికి పండుగలు ఒక వేదికగా ఉపయోగపడతాయి.తద్వారా మనుషుల మధ్య అనుబంధాలు బలపడతాయి.అయితే దేశంలో కరోనా మూడవ వేవ్ పొంచివున్నదనే ముందస్తు హెచ్చరికలని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేశాయి. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గినప్పటికీ కేరళలో రోజుకు 30 వేల కేసులు నమోదు అవుతున్నాయి.దేశంలో నాలుగు లక్షల పైగా యాక్టివ్ కేసులున్నాయి.ఈ నేపథ్యంలో
ఏ పండుగానైనా ప్రశాంతంగా, పర్యావరణ హితంగా జరుపుకోవడం మంచిది. ఇలా
చెప్పడాన్ని వివిధ మతాలపై దాడిగా భావించరాదు.

పండుగలు జరుపుకోవద్దని ఎవరూ చెప్పరు. పండుగలు,వేడుకలు,ఉత్సవాలు జరుపుకోవడం జీవితంలో ఒక భాగమే.అయితే దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. చిన్నపిల్లలకి ఇంకా వ్యాక్సిన్ రాలేదు.ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరు తమ మనోభావాలు దెబ్బతింటున్నాయి అనే ధోరణిలో కాకుండా సంయమనం పాటించాలి.
హేతువాదులు, సైన్స్ వాదులు,పర్యావరణ ప్రేమికులు ఎలాగూ పండుగలని పర్యావరణ హితంగా జరుపుకోమని ప్రచారం చేస్తారు.ప్రజలకి వివిధ 
కార్యక్రమాల ద్వారా అవగాహన కల్గిస్తారు.ఇందులో
పాలకులు, రాజకీయ నాయకులు కూడా భాగస్వామ్యులు కావాలి. వారు కూడా కరోనా నిబంధనలు పాటించాలి. కొంతకాలంపాటు పెద్ద పెద్ద బహిరంగ సభలు ఏర్పాటు చేయకూడదు. వివిధ మత పెద్దలు కూడా తమ మతస్థులకు పండుగలని నిర్మలంగా జరుపుకోమని సూచించాలి.తాము కరోనా నిబంధనలు పాటించకుండా, ప్రజలు మాత్రమే పాటించాలని చెప్తే పాలకులు ఆశించిన ఫలితాలు రావు.

కరోనా ఉమ్మడి శత్రువు.దీనిపై ఉమ్మడిగానే పోరాడాలి.వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా రాదని చెప్పలేము.కాకపోతే వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది. ఈ నేపథ్యంలో రాజకీయ, మత కోణంలో గాకుండా, విశాలమైన ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రతి
ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలి. వివిధ వేడుకల్ని పర్యావరణహితంగా జరుపుకోవాలి. లేనట్లయితే కరోనా మరో వేరియంట్ రూపంలో విజృంభించి మనందరిచేత బలవంతంగా నిబంధనలని పాటించేటట్లు చేస్తుంది.
జనవిజ్ఞానవేదిక-కనిగిరిడివిజన్

No comments:

Post a Comment