Sunday, 26 April 2020

కొవిడ్-19 రాజకీయార్థిక పరిచయం పార్ట్ 2 :: మనీష్ ఆజాద్


(హిందీ నుంచి ఇంగ్లిష్: హసన్ ప్రీత్, తెలుగు: ఎన్ వేణుగోపాల్)

(నిన్నటి పోస్ట్ తరువాయి)

ఈ కంపెనీలు మాంసం ఉత్పత్తి చేయడం మాత్రమే కాదు, తీవ్రమైన వ్యాధులకు కారణమయ్యే వైరస్ లను కూడ సాగు చేస్తాయని రాబ్ వాలేస్ మరో చోట రాశారు.

ఇదే పరిస్థితి వ్యవసాయంలో కూడ సాగుతున్నది. నిజానికి వృక్షజాతుల జన్యు నిర్మాణం అంత క్లిష్టమైనది కాదు గనుక,
సులభతరమైనది గనుక వ్యవసాయంలో జన్యు సాంకేతిక పరిజ్ఞానాన్ని చాల విస్తృతంగా వాడుతున్నారు. దానితో పాటు వ్యవసాయంలో పురుగుల మందులు, కలుపు మందులు (క్రిమి సంహారకాలు, గుల్మ నాశనులు) విపరీతంగా వాడుతున్న తీరు వల్ల, అవి భూమండల ఉష్ణోగ్రతలు పెరగడానికి మాత్రమే కాక, మొత్తంగా భూగోళపు సమస్త వాతావరణంలో నిర్ణయాత్మకమైన, గుణాత్మకమైన మార్పులకు దారి తీశాయి.

పందులకు ఆహారంగా సోయాబీన్ పిండి పెడుతున్నారు గనుక, సోయాబీన్ సాగు విస్తీర్ణం పెంచడానికి బ్రెజిల్ లో అమెజాన్ అడవులను నరికి సాగు భూమిగా మార్చారు. తత్ఫలితంగా, అక్కడి పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు, అప్పటివరకూ ఆ అరణ్యాలలో ఇతర జీవజాతులతో సంబంధం లేకుండా స్థానికంగా ఉండిపోయిన వైరస్ లతో మనుషులు ప్రత్యక్ష సంబంధంలోకి వచ్చారు. ప్రకృతి ఎంత సంక్లిష్ట నిర్మాణంతో ఉంటుందంటే ఎన్నో ప్రమాదకరమైన వైరస్ లను అది స్థానికతా ‘గృహాలలో’ నిర్బంధించి పెడుతుంది.

ఒక శాస్త్రీయ పరిశోధన ప్రకారం, అమెజాన్ అరణ్యాల నరికివేత ఏ పద్ధతిలో జరుగుతున్నదంటే, రానున్న 15 సంవత్సరాలలో అమెజాన్ ప్రాంతంలో కార్బన్ ను స్వీకరించే విశాల క్షేత్రమంతా కార్బన్ ను విడుదల చేసే ప్రాంతంగా మారిపోతుంది. పెట్టుబడిదారీ లాభాపేక్షతో మనం ఈ ప్రకృతి సహజమైన సంక్లిష్ట నిర్మాణంలో జోక్యం చేసుకుని, దాన్ని ఏకరూపకంగా మార్చినప్పుడు, మనం కచ్చితంగా వైరస్ లకు రాజమార్గాలు నిర్మిస్తున్నామన్నమాట.

ఇదే పద్ధతిలో పెట్టుబడిదారీ పారిశ్రామిక వ్యవసాయం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని తమ భూముల నుంచి బేదఖలు చేసింది. అప్పుల ఊబిలో దించిన ఫలితంగా రైతులు ఆత్మహత్యలు చేసుకునే స్థితి వచ్చింది. అది మొత్తం పర్యావరణాన్ని విషపూరితం చేసింది.

ఇవాళ విత్తనాల, పురుగుమందుల రంగంలో ఉన్న కంపెనీలలో అత్యధికం మొదటి, రెండో ప్రపంచ యుద్ధ కాలాల్లో, వియత్నాం యుద్ధ కాలంలో విషపూరిత వాయువులను ఉత్పత్తి చేస్తూ ఉన్నాయనేది ఒక ఆశ్చర్యకరమైన వాస్తవం. డ్యుపాంట్, మోన్సాంటో, డౌ కెమికల్ వంటి కంపెనీలు అమెరికాకూ, మిత్రరాజ్యాలకూ విషవాయువులను సరఫరా చేయగా, బేయర్ వంటి అగ్రశ్రేణి పురుగుల మందుల కంపెనీలు హిట్లర్ కు విషవాయువులను సరఫరా చేశాయి. డౌ కెమికల్, మోన్సాంటో వంటి కంపెనీలు వియత్నాం యుద్ధ సమయంలో అమెరికన్ సైన్యానికి ‘ఏజెంట్ ఆరెంజ్’ అనే కుఖ్యాతి పొందిన విషవాయువునూ, నాపామ్ బాంబునూ సరఫరా చేశాయి.

ఇక ‘శాంతి కాలం’లో, ప్రస్తుతం, ఈ కంపెనీలు అదే విషపూరిత రసాయనాలను పురుగుల మందులుగా మార్చి పర్యావరణాన్ని దెబ్బతీయడానికి వాడుతున్నాయి. ఒక ప్రతిష్ఠాత్మక పత్రికలో ప్రచురితమైన పత్రాన్ని ఉటంకిస్తూ, పంటల మీద కొట్టే పురుగుల మందులలో 99.9 శాతం నేరుగా పర్యావరణంలోకి వెళతాయని, కేవలం 0.1 శాతం మాత్రమే లక్ష్యాన్ని చేరుతాయని సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త దేవిందర్ శర్మ అన్నారు. ఈ 99.9 శాతం విష రసాయనాల వల్ల జీవజాతులకు సహకారిగా, స్నేహంగా ఉండే ఎన్నో రకాల బాక్టీరియా, వానపాముల వంటి ప్రయోజనకరమైన జీవజాతులు అంతరిస్తాయి.

మన దేశంలో పంజాబ్ లో పంటపొలాల్లో వాడిన పురుగుల మందులకూ అక్కడ పెరుగుతున్న కాన్సర్ వ్యాధి పీడితుల సంఖ్యకూ ఉన్న సంబంధం ఇప్పటికే అందరికీ తెలిసిందే. భటిండా నుంచి బికనేర్ కాన్సర్ ఆస్పత్రికి వెళ్లే రైలును అక్కడ ‘కాన్సర్ ఎక్స్ ప్రెస్' అని పిలుస్తున్నారు. దీనికి ‘జియో ఇంజనీరింగ్' నూ యుద్ధ పరిశ్రమనూ జోడిస్తే పరిస్థితి భయానకంగా మారిపోతుంది.

ఇది ఎంగెల్స్ ద్విశత జయంతి సంవత్సరం. మార్క్స్, ఎంగెల్స్ లు తమ కాలంలో పెట్టుబడిదారీ విధానపు ధోరణిని అర్థం చేసుకుని, పెట్టుబడిదారీ విధానం గురించి తమ అధ్యయనాలలో దాన్ని ప్రస్తావించారు. "ప్రకృతి తో వ్యవహరించేటప్పుడు, ఓడించిన విదేశీ ప్రజల పట్ల ప్రవర్తించే విజేత లాగ, ప్రకృతి నుంచి బైట నిలబడినవారిలాగ, అధికారం చలాయించలేమని ప్రతి అడుగునా మనకది గుర్తు చేస్తుంది. అందుకు భిన్నంగా, మనం మన రక్తమాంసాలతో, మెదడుతో ప్రకృతికి చెందినవాళ్లం. దాని మధ్య మనుగడ సాగించవలసిన వాళ్లం. దాని మీద మన ఆధిపత్యమంతా కేవలం మిగిలిన అన్ని జీవజాతులకన్న భిన్నంగా దాని నియమాలను అర్థం చేసుకోగలమనీ, ఆ నియమాలను సరిగ్గా అన్వయించగలమనీ మాత్రమే” అని ఎంగెల్స్ అన్నాడు.

పెట్టుబడిదారీ విధానానికి ముందు ఉన్న వర్గ వ్యవస్థలేవైనా కేవలం శ్రమను మాత్రమే దోపిడీ చేసేవి. శ్రమతో పాటు ప్రకృతిని కూడ దోపిడీ చేసే మొట్టమొదటి వర్గవ్యవస్థ పెట్టుబడిదారీ విధానం. కాని దాని దుష్ఫలితాలను మాత్రం యావత్తు మానవ జాతి అనుభవించవలసి వస్తుంది.

2011కూ 2018కీ మధ్య 172 దేశాల్లో మొత్తం 1,483 విస్తృతమైన అంటువ్యాధులు ప్రబలాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఇందుకు కారణమైన వైరస్ లను, ప్రధానంగా ఇన్ ఫ్లుయెంజా, సార్స్, ఎం ఇ ఆర్ ఎస్, ఇబోలా, జికా, ప్లేగ్, ఎల్లో ఫివర్ వగైరాలను, అధ్యయనం చేసిన గ్లోబల్ ప్రిపేర్డ్ నెస్ మానిటరింగ్ బోర్డ్ (జిపిఎంబి), ఇవాళ్టి కరోనా లాంటి మహా విపత్తు త్వరలో బైటపడనున్నదని కచ్చితమైన హెచ్చరికను 2019 సెప్టెంబర్ లోనే ఇచ్చింది. ‘ప్రమాదంలో ప్రపంచం’ (ఎ వరల్డ్ ఎట్ రిస్క్) అనే శీర్షికతో వెలువడిన ఆ నివేదికను పరిగణనలోకి తీసుకునేవాళ్లు ఒక్కరూ లేకపోయారు.

అంతే కాదు, 2003-04లో వచ్చిన సార్స్ మహామ్మారికి ముందే శాస్త్రవేత్తలు కరోనా కుటుంబానికి చెందిన ఒక వైరస్ భవిష్యత్తులో మహా ప్రమాదకరంగా మారనున్నదని హచ్చరిక విడుదల చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాల ప్రజా ఆరోగ్య వ్యవస్థలకు మూడు సంవత్సరాల కిందనే ఒక హెచ్చరిక జారీ చేసింది. ఒకానొక వైరస్ మహా భయానకమైన మహమ్మారిని సృష్టించబోతున్నదని, అన్ని ప్రభుత్వాలు ఆ సవాలును ఎదుర్కోవడానికి సమాయత్తం కావాలని ఆ హెచ్చరిక చెప్పింది.

ఈ హెచ్చరికలను విని ఉంటే పరిశోధనా కార్యక్రమాలు చేపట్టవలసి ఉండింది. తమ ప్రజారోగ్య సేవల వ్యవస్థలను బలోపేతం చేసి భవిషత్తు అవసరాలకు సంసిద్ధం చేసి ఉండవలసింది. కాని ఆ పనులు చేయవలసిన సామ్రాజ్యవాద - పెట్టుబడిదారీ వ్యవస్థ 2007-08 సంక్షోభం తర్వాత తానే స్వయంగా ఐసియులో ఉన్నప్పుడు అది భవిష్యత్తుకు ఎలా సంసిద్ధం కాగలుగుతుంది? 90 ట్రిలియన్ డాలర్ల విలువైన ప్రపంచ పెట్టుబడిదారీ విధానం తనంతట తానే 270 ట్రిలియన్ డాలర్ల రుణభారం కింద మూలుగుతున్నప్పుడు అది ఏ జాగ్రత్తలు తీసుకోగలుగుతుంది?

ప్రపంచంలోని అనేక దేశాలలో అంతవరకూ ఎంతో కొంత ఉండిన "ప్రజా" రంగం కూడ ప్రైవేటీకరణ తుపానులో ధ్వంసమైపోయింది. ప్రతి వ్యవస్థనూ, నిర్మాణాన్నీ ప్రైవేటు రంగానికి అప్పగించారు. చాల దేశాల్లో ప్రభుత్వ వైద్య ఆరోగ్య సేవా రంగాలు ధ్వంసమైపోయాయి. అమెరికా, బ్రిటన్ లలో ప్రభుత్వ ఆరోగ్య సేవల రంగాలను ఎట్లా ధ్వంసం చేశారో మైకేల్ మూర్, జాన్ పిల్జర్ లు తీసిన డాక్యుమెంటరీలు చూస్తే అర్థమవుతుంది.

మరొక వంక, తక్షణ లాభాలు లేని రంగాలలో ప్రైవేట్ కంపెనీలు పరిశోధనలు ఎందుకు సాగిస్తాయి? ఇది స్పష్టంగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చూడాలి. జన్యు చికిత్స మీద పరిశోధన చేస్తున్న ఒక కంపెనీకి సంబంధించిన ఇమెయిల్స్ పొరపాటున బైటపడ్డాయి. ఆ కంపెనీలో మదుపు పెట్టిన గోల్డ్ మాన్ సాక్స్ రాసిన ఇమెయిల్ లో జన్యువులో మార్పులు చేసి అసలు అనారోగ్యమే రాకుండా చేయడానికి పరిశోధనలు జరపడం 'సుస్థిరమైన వ్యాపార తర్కం' కాదు అని మందలించారు. జబ్బు అనేది ఎప్పుడూ వస్తూ ఉండడమే ఎప్పుడూ లాభాలు తెచ్చి పెడుతుంది. అసలు జబ్బే రాకుండా చేయడమంటే లాభాలు రాకుండా చేయడమే. అంటే అది సుస్థిరమైన వ్యాపార తర్కం కాదు.

ఇంతకూ వాస్తవమేమంటే, 2020 ప్రారంభంలో అల్లకల్లోలం చేయడానికి వచ్చిన కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవలసిన ప్రపంచాన్ని అప్పటికే ముప్పై సంవత్సరాలుగా ప్రపంచీకరణ చెదలు తినేస్తున్నది. ఆ ప్రపంచపు వాస్తవ దృశ్యాన్ని గుర్తించడానికి మీరు కేవలం రెండు అంశాలు చూస్తే చాలు:

ఒకటి, ఈ భూమిని తొమ్మిది సార్లు ధ్వంసం చేయడానికి తగిన ఆయుధ సామగ్రి మన దగ్గర ఉంది గాని, అదే సమయంలో మన దగ్గర జీవితాన్ని నిలపడానికి అవసరమైన వెంటిలేటర్లు మాత్రం కావలసినన్ని లేవు. ఈ వెంటిలేటర్ల తీవ్రమైన కొరతే ఇవాళ కరోనా వల్ల జరిగే మరణాలకు ప్రధాన కారణం కానుంది.

రెండోది, ఇవాళ ప్రపంచంలోని 2,153 మంది సహస్ర కోటీశ్వరుల దగ్గర ఉన్న సంపద, 406 కోట్ల మంది దగ్గర ఉన్న సంపదతో సమానం. ఈ ప్రపంచీకరణ వ్యవస్థకు నిర్మాత అయిన అమెరికా ప్రస్తుతం అత్యంత దారుణమైన దుస్థితిని అనుభవిస్తున్నదంటే కారణం అదే. అందుకు భిన్నంగా, ఒక భిన్నమైన సామాజిక ఆర్థిక వ్యవస్థ ఉన్న క్యూబా మెరుగైన స్థితిలో ఉన్నది. క్యూబా కరోనాను అదుపులో పెట్టడం మాత్రమే కాదు, కరోనా వ్యతిరేక పోరాటంలో ప్రపంచంలోనే అగ్రశ్రేణిలో ఉండి 62 దేశాలకు తన వైద్యులను, ఔషధాలను పంపిస్తున్నది. ఇతరదేశాలకు సైన్యాన్ని, ఆయుధాలను పంపించే పని అమెరికా చేస్తుండగా, వైద్యులను, ఔషధాలను పంపించే పని క్యూబా చేస్తున్నది. రెండు భిన్నమైన సామాజిక వ్యవస్థల మధ్య తేడా ఇదే. ఒకటి మృత్యువును ఎగుమతి చేసే వ్యవస్థ, మరొకటి జీవితాన్ని ఎగుమతి చేసే వ్యవస్థ.

వాస్తవానికి, ప్రఖ్యాత రచయిత నౌమి క్లీన్ అన్నట్టు, భూకంపం, తుపాను, మహమ్మారి వంటి ఉత్పాతం వచ్చినపుడు పాలకవర్గాలు తమ భావజాలాన్ని వదులుకోవు, మరింత గట్టిగా అంటిపెట్టుకుంటాయి. అందువల్లనే ఇంతటి ఉత్పాతంలో కూడ అవి తమ వర్గ ప్రయోజనాల మీద, భవిష్యత్తు లాభాల మీద దృష్టి పోగొట్టుకోవడం లేదు. అవి ఇంతకాలమూ అణచిపెట్టుకున్న అత్యాశలు కూడ ఇటువంటి సమయంలోనే బైటపడతాయి. వాటిని తీర్చుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తాయి.

గత సంవత్సరం, 2019 ఒక గొప్ప నిరసన ప్రదర్శనల, ఉద్యమాల సంవత్సరం. చాల మంది రాజకీయ విశ్లేషకులు ఆ సంవత్సరాన్ని 1848తో, 1968తో పోల్చారు. ఆ సంవత్సరం భూగోళంమీద ఏ ఒక్క మూల కూడ భారీ ప్రజా ప్రదర్శనలు చూడకుండా లేదు. భారతదేశంలో కూడ ఈ కాలంలోనే సిఎఎ కు వ్యతిరేకంగా బ్రహ్మాండమైన ప్రదర్శనలు జరిగాయి. కరోనా సాకుతో పాలకవర్గాలు ఈ ఉద్యమాలన్నిటినీ తక్షణమే మూసివేయడంలో విజయం సాధించాయి. ప్రపంచవ్యాప్తంగా అంతటి భారీ స్థాయి ప్రజా రాజకీయ ఉద్యమాలు కరోనా సాకుతో మరణించడం, కరోనా మరణాల కన్న తక్కువదేమీ కాదు. ఇవాళ ప్రపంచమంతటా కరోనా మరణాల గురించి పత్రికలు హోరెత్తుతున్నాయి. మన దేశంలో షాహీన్ బాగ్ నిరసన ప్రదర్శనలు ఎలా ముగిసిపోయాయో ప్రతి ఒక్కరికీ తెలుసు.

ప్రపంచమంతటా మాంద్యం ముసురుకుంటున్నప్పుడు, తమ లాభాల వాటాను కాపాడుకోవడానికి కంపెనీలు తమ కార్మికులను, ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించడానికి కంకణం కట్టుకున్నాయి. కాని అవి ఆ పని చేయడానికి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతూ ఉండింది. ఇప్పుడు కరోనా వారికి మహా అవకాశం ఇచ్చింది. ఈ కాలంలో మొత్తం ఎంతమందిని ఉద్యోగాలనుంచి తొలగించారో వాస్తవ గణాంకాలు తర్వాత బైటపడతాయి. కాని ఈలోగా మనం వాస్తవాల ఆధారంగా కొన్ని అంచనాలు వేయవచ్చు. ఒక్క అమెరికాలోనే ఒక కోటీ ఎనబై లక్షల మంది గత రెండు నెలల్లో కొత్తగా నిరుద్యోగ భృతికి దరఖాస్తు పెట్టుకున్నారు. 1929-30 నాటి మహా సంక్షోభం తర్వాత ఇంతమంది నిరుద్యోగులు కావడం ఇప్పుడే.

ఈ కరోనా మహావిపత్తు కాలంలో అనేక దేశాల ప్రభుత్వాలు ఎటువంటి నిరంకుశ పద్ధతులను అమలు చేస్తున్నాయో చూస్తే, అవి వాళ్ల పీడనా కాంక్షను వ్యక్తీకరిస్తున్నాయనిపిస్తున్నది. హంగరీతో సహా ఎన్నో దేశాలు నేరుగానే అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. మన దేశంలో కూడ, మోడీ స్పష్టంగానే 'సామాజిక అత్యవసర పరిస్థితి' గురించి మాట్లాడాడు. నిజానికి ఇది భారత్ వంటి మూడో ప్రపంచ దేశాలలో దారుణంగా ఉంది. మార్చ్ 21న, కొలంబియాలోని బొగొటా జైలులో కరోనాతో వ్యవహరించడానికి తగిన మెరుగైన పరిస్థితులు కల్పించమని అడిగిన ఖైదీల మీద పోలీసులు దాడిచేసి, కాల్పులు జరిపి 23 మంది ఖైదీలను చంపేశారు. కెన్యాలో వీథుల్లో పోలీసు కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య కరోనాతో చనిపోయినవారి సంఖ్య కన్న ఎక్కువ. మామూలు సందర్భాల్లోనైతే ఇవి ప్రధాన వార్తలు అయి ఉండేవి. కాని కరోనా కాలంలో ఈ వార్తలకు దిక్కే లేదు.

వివిధ దేశాల ప్రభుత్వాలు, ఇంటర్నెట్ కంపెనీలు కలిసి కరోనా సాకుతో తమ దేశాలను అక్వేరియంలలాగ మార్చేశాయి. పౌరుల ప్రతి చర్యా నిఘాకు గురవుతున్నది. మామూలు సమయాల్లోనైతే ఇంత నిఘా ఉంటే తీవ్రమైన వ్యతిరేకత వచ్చేది, కాని ప్రస్తుత స్థితి ఒక "కొత్త సాధారణ స్థితి" లాగున్నది. ఇవాళ మన ముందర గూఢచారి పెట్టుబడిదారీ విధానం దాని నగ్నరూపంలో ఉన్నది. జార్జి ఆర్వెల్ రాసిన 1984 ఇవాళ ఇంకెంతమాత్రమూ ఒక నవల కాదు, ఒక కఠోర వాస్తవం. విచిత్రమైన విషయమేమంటే ఆ నవల రాసినప్పుడు, దాన్ని సినిమాగా తీసినప్పుడు సోషలిజం మీద విమర్శగా వెలువరించారు. ఇవాళ పెట్టుబడిదారీ విధానమే ఆ నవలలో, సినిమాలో చూపినదానికన్న ఘోరంగా ఉండగలనని చూపుకుంటున్నది. ఆలోచనల మీద నిఘా, ఆలోచనల మీద పోలీసులు అనే మాటలు ఇవాళ కనీసం భారతదేశంలో అక్షరాలా నిజాలయ్యాయి. నేనీ వాక్యం రాస్తున్నప్పుడే, కరోనా విషయంలో ప్రభుత్వ వైఫల్యం గురించి ఫేస్ బుక్ మీద వ్యాఖ్య రాసినందుకు ఇంఖిలాబి మజ్దూర్ కేంద్ర కు చెందిన కైలాష్ భట్ ను అరెస్టు చేశారని వార్త వస్తున్నది.

కరోనా ధనికులకూ పేదలకూ మధ్య వ్యత్యాసం చూపదని ప్రధానస్రవంతి ప్రచార సాధనాలు పదే పదే చెపుతున్నాయి. కాని అన్ని సందర్భాలలో లాగనే ఈ సందర్భంలో కూడ ప్రధానస్రవంతి ప్రచారసాధనాల మాట తప్పు. అన్ని రకాల ఆర్థిక సామాజిక విభజనలను కరోనా పూర్తిగా బలోపేతం చేస్తున్నది. మనం అమెరికాలోని అంకెలనే పరిశీలిస్తే, మరణాలలో 70 శాతం నల్లజాతి వారివి, ఆఫ్రికన్ అమెరికన్లవి. ఇప్పుడు కరోనా సమయంలో ఫోన్ ఎక్కడెక్కడికి వెళ్లిందనే దాన్ని బట్టి వారి సామాజిక చలనాన్ని చెప్పే సమాచారాన్ని ఎన్నో సంస్థలు బైటపెడుతున్నాయి. ఆ సమాచారాన్ని బట్టి అమెరికా, యూరప్ లలో దాదాపు పది శాతం జనం అసలు ఎక్కడికీ కదలడమే లేదు. అంటే వాళ్లు పూర్తిగా తమ ఇళ్లలోనే ఉంటున్నారు. అదే సమయంలో ఆర్థిక స్థాయిలో అట్టడుగు 30 శాతం జనాభాలో విపరీతమైన చలనం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ చలనంలో ఉన్న ప్రజానీకమే కరోనాకు అతి పెద్ద బాధితులుగా ఉన్నారు. అంటే తమ జీవిక కోసం బైట తిరగక తప్పని జనం కరోనా బాధితులుగా ఉన్నారన్నమాట. వారు ఇంట్లో ఉండడం అసాధ్యం. ఈ సందర్భంలో రానా అయ్యూబ్ రాసిన 'సామాజిక దూరాన్ని పాటించడం ఒక విలాసం' అనే వ్యాసం చూడడం మంచిది. భారత దేశంలో గాని, ప్రపంచంలో ఎక్కడైనా గాని మురికివాడల్లో సామాజిక దూరం, సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఒక క్రూర పరిహాసం.

వాస్తవంగా వరదనీరు అంతా తీసిన తర్వాత మాత్రమే ఆ ప్రాంతపు నిజమైన చీదర అంతా కనబడుతుంది. ఈ కరోనా వెళ్లిపోయిన తర్వాతనే మన వ్యవస్థ ఎంత దుర్మార్గమైనదో బైటపడుతుంది. అయితే వరద నీరు ఉన్నప్పుడు కూడ మీరు చూడగలిగినవి కొన్ని ఉంటాయి. స్పానిష్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన రహస్య ఆదేశాల ప్రకారం 60 సంవత్సరాల వయసు దాటినవాళ్లను ఐసియులలో చేర్చుకోవద్దని అన్నారు. వారికి బదులుగా యువ వ్యాధి పీడితులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అమెరికాలో టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ డాన్ పాట్రిక్ మరింత నిర్దాక్షిణ్యంగా ముసలివాళ్లు తమ జీవితాలను అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కోసం, యువతరం కోసం త్యాగం చేయాలని అన్నాడు. వ్యాపార పత్రిక బ్లూంబర్గ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికన్ శత కోటీశ్వరుడు టాం గాలిసానో ఈ మాటనే మరింత గట్టిగా చెప్పాడు. ఆర్థిక వ్యవస్థను మూసివేయడం కన్న కొందరు వ్యక్తులు చనిపోవడం మంచిది అని ఆయన అన్నాడు. ఇంగ్లండ్ ప్రధానమంత్రి మరొక అడుగు ముందుకు వేసి జనం చచ్చిపోతేనే కరోనాకు వ్యతిరేకంగా సమూహ రోగ నిరోధకశక్తి పెరుగుతుందని అన్నాడు. కరోనాకు ఈ మాట చాల నచ్చినట్టుంది, అది వెంటనే ఆయనకే సోకింది. ఇవాళ ఆయన లండన్ లో ఒక ఆస్పత్రిలో ఐసియు లో ఉన్నాడు. ఈ మాటలన్నీ కూడ 1942 భారత్ క్షామం సమయంలో చర్చిల్ చేసిన ప్రకటనను గుర్తుకు తెస్తున్నాయి. భారతీయులు తమ జనాభాను ఎలుకల్లాగ ఇబ్బడి ముబ్బడిగా పెంచుతున్నారనీ, ఆ జనాభా ఆ క్షామంతో అదుపులోకి వస్తుందని చర్చిల్ అన్నాడు.

ఇప్పుడిక మనం భారతదేశం సంగతి చూద్దాం. ఏప్రిల్ 5న అకాలంగా వచ్చిన దీపావళిని భక్తితో చూడని వాళ్లెవరయినా ఈ దేశంలోని నామమాత్రపు ప్రజాస్వామ్యం ఇవాళ్టికి మూర్ఖస్వామ్యంగా మారిపోయిందని గుర్తించగలరు. మర్జ్ బడ్తా హి గయా జో జో దవాకి (ఎట్లెట్లా మందులు వేసుకుంటానో అట్లట్లా వ్యాధి పెరుగుతూ పోతున్నది) అని మీర్జా గాలిబ్ రాసిన కవితా వాక్యం ఇవాళ్టి భారత పాలకవర్గాలకు సరిగ్గా సరిపోతుంది.

మొదట పెద్ద నోట్ల రద్దును గుర్తు చేసుకుందాం. నల్లధనాన్ని అరికట్టడానికనే పేరుతో పెద్దనోట్ల రద్దు జరిగింది. కాని పెద్ద నోట్ల రద్దుతో నల్ల ధనమంతా తెల్ల ధనమైపోయింది. ఉన్న నోట్ల కన్న ఎక్కువ నోట్లు తిరిగివచ్చాయి. కాని నియంత చూపిన ఈ ఉన్మాదం వల్ల కోట్లాది భారతీయుల బతుకుతెరువు ధ్వంసమైపోయింది. భారత ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పింది. అదే విధంగా మార్చ్ 24 లాక్ డౌన్ తర్వాత ఏర్పడిన పరిస్థితులు కరోనా మరింత వ్యాపించడానికి దారి తీశాయి. లక్షలాది మంది వలస కార్మికులు 'వెనుకకు లాంగ్ మార్చ్' చేయవలసిన పరిస్థితికి నెట్టబడ్డారు. ఎండలో, వానలో, దప్పికగొన్న ఈ వలస కార్మికులు కరోనాకు అత్యంత సులభంగా దొరికే ఎరలుగా మారారు. కొన్ని షెల్టర్ హోమ్స్ లో జనాన్ని ఎట్లా కుక్కేశారంటే, అవి వారి కార్మిక శిబిరాల్లో లాంటి దుస్సహమైన పరిస్థితినే కొనసాగించాయి. రహదారుల పక్కనా, గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఎన్నో పాములకూ తేళ్లకూ మండ్రగబ్బలకూ నిలయాలయ్యాయి. మరెన్నో క్వారంటైన్ కేంద్రాలు జైళ్ల కన్న హీనంగా ఏ నేరం చేయని లక్షలాది మందిని నిర్బంధించాయి. వీరందరూ కరోనాకు అందుబాటులో ఉన్న బాధితులే. ఔను, ఈ సమయంలో ఉన్నత వర్గాలు, మధ్యతరగతి వర్గాలు కచ్చితంగా సుఖంగా, భద్రంగా ఉండిపోయారు. భారతదేశంలో సామాజిక దూరం అంటే వాస్తవంగా వర్గ దూరమే. దీని అసలు ఉద్దేశం ఉన్నత, మధ్యతరగతి వర్గాలకూ, పేద వర్గాలకూ దూరాన్ని పెంచి, కరోనాను పేద వర్గాలవైపు పంపించడమే.

అలా రహదారుల మీదికి వచ్చిన కార్మికులందరూ తమ ఇంటర్వ్యూల్లో తాము కరోనా కన్న ఆకలికీ, పోలీసు లాఠీకీ ఎక్కువ భయపడతామని చెప్పారు. ఈ నిస్సహాయ కార్మికులు తమ గ్రామాలకు సంతోషంగా ఏమీ తిరిగి వెళ్లడం లేదు. వారు తిరిగి వెళుతున్న గ్రామసీమల్లో ప్రతి రోజూ 31 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటువంటి సంక్షోభ సమయంలో కూడ ఈ రహదారుల మీది వలస కార్మికులతో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు, వారి మీద కురిపిస్తున్న లాఠీ దెబ్బలు, వారికి శిక్షలు విధిస్తున్న తీరు, మన పాలకవర్గాల వర్గ/కుల దురభిప్రాయాలనూ, వారి పైశాచిక మనస్తత్వాన్నీ అత్యంత దారుణంగా, అసహ్యకరంగా బైటపెడ్తున్నాయి.

కరోనా సందర్భంలో ఖైదీలను విడుదల చేయమని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా 11000 మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వమే లాక్ డౌన్ ను ఉల్లంఘించారనే పేరుతో, అంతకన్న ఎక్కువమందితో జైళ్లను నింపుతున్నదంటే ఈ ప్రభుత్వపు దివాళాకోరుతనానికి అంతకన్న మంచి ఉదాహరణ ఉండదు. ఈ దేశంలో ప్రభుత్వాలు ఎంత దివాళాకోరుతనంతో పనిచేస్తున్నాయో దీనితో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి భారత ప్రభుత్వానికి ఎటువంటి వ్యూహమూ లేదు, ఎటువంటి ముందస్తు ఏర్పాటూ లేదు. వారి దగ్గర అసలు నమ్మదగిన అంకెలే లేవు. కాని మోడీ ప్రభుత్వానికి ప్రతి సందర్భాన్నీ ఒక ఉత్సవంగా ఎట్లా మార్చాలో తెలుసు. చివరికి కలుపు మొక్కలకు సంస్మరణ ఉత్సవాలు కూడ జరపగలరు. అది చాల బాగా కూడ చేస్తున్నారు.

యూరపియన్ దేశాలను అనుకరిస్తూ, భారత ప్రభుత్వం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా హఠాత్తుగా లాక్ డౌన్ ప్రకటించింది. చివరికి అనుకరణలోనైనా కొంత మెరుగు పరచవలసి ఉంటుంది. రాత్రి ఎనిమిది గంటలకు లాక్ డౌన్ ప్రకటించగానే, జనం విపరీతంగా దుకాణాలను చుట్టుముట్టారు. ప్రకటిత సామాజిక దూరపు నియమాలన్నిటినీ ఉల్లంఘించారు. హాస్టళ్లలోని విద్యార్థులు, యువజనులు, తాత్కాలిక కార్మికులు పెద్ద ఎత్తున బస్ స్టేషన్లకూ, రైల్వే స్టేషన్లకూ తరలి వచ్చారు. ఉన్నత మధ్యతరగతి వర్గాలను మాత్రం రక్షించి, పేద కార్మికులను కరోనా అనే సింహానికి అప్పగించడానికే ఇది జరిగిందని చెప్పవచ్చు.

భారత దేశంలో సాలీనా నాలుగు లక్షల మంది క్షయవ్యాధితో చనిపోతున్నారు. దానికి ప్రధాన కారణాలలో ఒకటి పేదరికం. ప్రస్తుత లాక్ డౌన్ ఆ పేదరికాన్ని మరింత పెంచుతుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ తాజా నివేదిక ప్రకారం, లాక్ డౌన్ తర్వాత దేశంలో 40 కోట్లమంది మరింత పేదరికంలోకి దిగజారనున్నారు. అంటే ఈ సంవత్సరం క్షయవ్యాధితో మరణించేవారి సంఖ్య పెరగనున్నది. మరి కరోనా బారిన పడకుండా ఒకరిని రక్షించడంలో, క్షయవ్యాధితో మరణించే నలుగురిని తయారు చేయడం ఎంత సమర్థమైన వ్యూహం? ఈ కరోనా సమయంలో దాదాపు అన్ని ఆస్పత్రులలోనూ ఔట్ పేషెంట్ శాఖలను మూసేశారు. ఢిల్లీలోని ఎఐఐఎంఎస్ వంటి ఆస్పత్రి కూడ తన ఔట్ పేషంట్ విభాగాన్ని మూసేసింది. చివరికి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న కాన్సర్ పేషంట్లకు కూడ చికిత్స చేయడం లేదు. ఢిల్లీలో కాన్సర్ వ్యాధి గ్రస్తులందరూ ఎఐఐఎంఎస్ దగ్గరా, ఇతర ఆస్పత్రుల దగ్గరా మృత్యువు కోసం ఎదురుచూస్తూ పడిఉన్నారు. ప్రైవేట్ క్లినిక్ లు నడిపే చాల మంది డాక్టర్లు తమ క్లినిక్ లు మూసేశారు. తమ సొంత భద్రత తాము చూసుకుంటున్నారు. ఎంతమంది కరోనా పేషంట్లను కాపాడే క్రమంలో మరెంతమంది ఇతర వ్యాధిగ్రస్తులను మనం చంపేస్తున్నామో లెక్కలు బహుశా ఎప్పటికీ బైటికి రాకపోవచ్చు.

మరి పాపం, భారత దేశం ఏం చేయగలుగుతుంది? గత కొన్ని దశాబ్దాలుగా మన సమయమంతా హిందూ - ముస్లిం ఘర్షణలు రెచ్చగొట్టడంలోనే సరిపోయింది. ఇక మిగిలిపోయిన మన పనిని ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి సామ్రాజ్యవాద సంస్థలో, అమెరికానో చేసిపెట్టాయి. అలా మనం నిర్వహించిన 'బహు సుందరమైన' కార్యక్రమాల ఫలితంగా ఇవాళ మనం ప్రతి 10,000 మందికి ఒక ఎంబిబిఎస్ డాక్టర్ ఉండే స్థితికి చేరుకున్నాం. అలాగే ప్రతి వెయ్యి మందికి ఆస్పత్రిలో సగం మంచం ఏర్పాటు చేశాం. ఇదేమీ హాస్యం కాదు, అత్యంత తీవ్రమైన జబ్బులు ఉన్నవారిని కూడ ఇద్దరు వ్యక్తులను ఒకే బెడ్ మీద పడుకోబెట్టడం ఎన్నో ఆస్పత్రుల్లో జరుగుతున్నది. బీహార్ లోని 18 జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క వెంటిలేటర్ కూడ లేదు. ఈ పరిస్థితుల వల్ల, కేవలం ఆరోగ్య సేవల మీద ఖర్చుల వల, ప్రతి సంవత్సరం దేశంలో ఐదు కోట్ల ఐదు లక్షల మంది దారిద్ర్యరేఖ కిందికి జారిపోతున్నారు. కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కోవడానికి తగిన స్థితిలో భారతదేశం ఏరకంగా చూసినా లేదు.

కాని ఇక్కడి ప్రచార సాధనాలు మాత్రం అన్నిటికీ అన్ని సమయాల్లోనూ సిద్ధంగా ఉంటాయి. ఇక కరోనాకైతే అవి సంసిద్ధంగా ఉండడం కంటే ఎక్కువ సంసిద్ధంగా ఉన్నాయి. అవి మొదట కరోనా విషయంలో చైనా మీద గురి పెట్టాయి. అమెరికా అన్న మాటనల్లా తిరిగి పలికాయి. కాని భారత ప్రభుత్వమే వెంటిలేటర్లు కావాలనీ, టెస్టింగ్ కిట్స్ కావాలనీ చైనాను అడగవలసి వచ్చేసరికి, మన ప్రచార సాధనాలు అప్పటిదాకా పాడుతున్న పాటను మధ్యలో ఆపేసి, ఎల్లప్పుడూ ఇష్టపూర్వకమైన శత్రువైన ముస్లింల మీదికి తమ గురిని తిప్పాయి. కరోనా మొత్తానికీ నిందను ముస్లింల మీద మోపడం మొదలుపెట్టాయి. సంఘ్ ఐటి సెల్స్ లాక్ డౌన్ ను సంపూర్ణంగా వినియోగించుకుని, తామే కరోనా పాత్రను పోషించడం మొదలుపెట్టాయి. ప్రజలకు తమ విషం అంటించడానికి ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. సిఎఎ వ్యతిరేక ఆందోళనలో ముస్లింలు నిర్వహించిన పాత్రకు ప్రతీకారం తీసుకోవడానికి ప్రభుత్వానికి ఒక అవకాశం దొరికింది. మసీదు నుంచి బైటికి వస్తున్న ముస్లింల మీద పోలీసులు లాఠీల వర్షం కురిపిస్తున్న వీడియో, రానా అయ్యూబ్ ట్విట్టర్ మీద చూపిన వీడియో ఎవరు మరిచిపోగలరు? ఎంతమంది ముస్లింలను, లేదా ముస్లిం మొహల్లాలను కరోనా కారణంగా క్వారంటైన్ చేశారో, కేవలం వారు ముస్లింలైనందువల్లనే క్వారంటైన్ చేశారో, ఇప్పుడెవరికీ రహస్యం కాదు. మొత్తం ప్రపంచమంతా కరోనా వైరస్ జన్యు నిర్మాణం ఏమిటని అధ్యయనం చేస్తున్న సమయంలో మనం కరోనా మతమేమిటో కనిపెట్టడంలో తలమునకలై ఉన్నాం.

నిజం చెప్పాలంటే భారత దేశం వంటి పేద దేశంలో, శ్రామిక జనాభాలో 94 శాతం అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్న చోట, సగం కన్న ఎక్కువ జనాభా దుర్భర దారిద్ర్యంలో మగ్గిపోతున్న చోట, సంపూర్ణ లాక్ డౌన్ సరైన నిర్ణయం కాజాలదు. ఇంకా ఇంకా ఎక్కువ పరీక్షలు జరపవలసింది. ఆ పరీక్షా ఫలితాలను బట్టి స్థానిక లాక్ డౌన్ లు, స్థానిక క్వారంటైన్ లు ఏర్పాటు చేయవలసింది. కాని వాస్తవమేమంటే, భారత దేశం ఇప్పటికి పది లక్షల మంది ప్రజలకు 137 పరీక్షలు మాత్రమే జరపగలిగింది. కనికా కపూర్ కు ఇప్పటివరకూ ఏడు సార్లు పరీక్షలు జరిగాయనేది గుర్తుంచుకుంటే, ఈ లెక్క కూడ సరికాదని, ఒకే వ్యక్తికి ఒకటి కన్న ఎక్కువ పరీక్షలు జరిగి ఉండవచ్చునని తేలుతుంది. చివరికి పాకిస్తాన్, శ్రీలంక కూడ పరీక్షల విషయంలో మనకంటె మెరుగుగా ఉన్నాయి. పాకిస్తాన్ లో పది లక్షల మందికి 262 పరీక్షలు, శ్రీలంకలో 152 పరీక్షలు జరిగాయి. ఇటలీ, జర్మనీలలోనైతే పదిలక్షల మందికి 15,000 పరీక్షల దాకా జరిగాయి.

ఇవాళ ఈ కరోనా సమయంలో, అంతకు ముందు క్రమబద్ధంగా పర్యావరణ, ఆరోగ్య, దారిద్ర్య, జల్ జంగల్ జమీన్ సమస్యలు లేవనెత్తుతుండిన, ఈ అమానవీయ వ్యవస్థలో మానవ మనుగడకు సంబంధించిన మౌలిక ప్రశ్నలు లేవనెత్తుండిన, తమకు తోచిన పద్ధతులలో పోరాటాలు జరుపుతుండిన గళాల మీద, శక్తుల మీద నిర్బంధం అమలవుతున్నది. కాని కరోనానంతర సమయంలో ఈ గళాలు మరింత ఎక్కువగా, మరింత బలంగా వినబడతాయి. పద్నాలుగో శతాబ్దిలో యూరప్ లో ప్లేగ్ అనే మహమ్మారి దాడిచేసి, నాటి యూరప్ జనాభాలో మూడో వంతును చంపేసింది. ఆ మహమ్మారి ప్రధాన ఫలితం ఏమంటే సాధారణ ప్రజానీకం చర్చ్ లో విశ్వాసం కోల్పోయారు. అదే యూరప్ లో పునరుజ్జీవనానికి అత్యంత కీలక దోహదం చేసింది. ఆ వరుసలో బూర్జువా ప్రజాస్వామిక విప్లవాలు చెలరేగాయి. ఈసారి కూడ అలా జరుగుతుందా?

ఎడువార్డో గలియనో అన్నట్టు చరిత్ర ఎప్పుడూ వీడ్కోలు అనే మాట అనదు. చరిత్ర ప్రతిసారీ, మళ్లీ కలుద్దాం అనే అంటుంది.

రాత్రి ఎంత గాఢమైన చీకటి అలముకున్నా, ఎల్లప్పుడూ అందులో ఉదయానికి సంబంధించిన ఒక ఆశారేఖ ఉంటుంది. ఈ సందర్భంలో చార్లెస్ డికెన్స్ సుప్రసిద్ధ నవల రెండు మహానగరాలు లోని బహుళార్థ బోధకమైన ప్రారంభవాక్యాలు మళ్లీ ఒకసారి చెప్పాలనిపిస్తున్నది: "అది ఒక వైభవోజ్వల మహాశకం. అది అధ్వాన్నపు వల్లకాటి కాలం. అది వివేక సంపన్న యుగం, అది మూర్ఖత్వపు సామ్రాజ్యం. అది మూఢ విశ్వాసాల కాలం, అది మహా సంశయాల కాలం. అది వెలుగులీనిన యుగం, అది మహాంధకారపు సమయం. అది ఆశల ఊట, అది నిరాశల కోట."

(మనీష్ ఆజాద్ రాజకీయ కార్యకర్త. మావోయిస్టు కార్యకర్తలు అనే ఆరోపణతో ఆయననూ ఆయన సహచరినీ అరెస్టు చేసి ఎనిమిది నెలల నిర్బంధం తర్వాత ఫిబ్రవరి 29న బెయిల్ మీద విడుదల చేశారు.)

No comments:

Post a Comment